Sunday, November 7, 2010

JAL cyclone - FLASH

కాకినాడ: ఉప్పాడ వద్ద కెరటాలు విరుచుకు పడుతున్నాయి. ఆరు నుంచి ఎనిమిది అడుగుల మేర అలలు ఎగసి పోటెత్తుతున్నాయి. దీనితో ఉప్పాడ తీరం వద్ద పరిస్థితి భీభత్సంగా కనిపిస్తోంది. సురక్షిత ప్రాంతాలకు చేరుకునే క్రమంలో ఇటుగా వెళుతున్న కొందరు అలల ఈడ్పుకు ఎగిరివెళ్ళి అల్లంత దూరంలో పడ్డారు. ఈ దృశ్యాలను సాక్షి టీవీ ప్రతినిధులు సాహసోపేతంగా చిత్రీకరించారు. అలాగే విశాఖపట్నం ప్రతినిధి ఒకరు కల్లోలంగా ఉన్న కడలిపై పడవలో ప్రయాణించి అలల మహోగ్ర రూపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఊయల ఊగుతున్న పడవలో నుంచి తిలకిస్తే ఆకాశాన్ని తాకడానికి పోటీపడుతున్న అలల ఉద్ధృతి తెలుస్తోంది. అలాగే అల్లకల్లోలంగా వున్న సముద్ర గమనం, ఈదురుగాలి హోరు గగుర్పొడుస్తోంది.
వెటకు వెళ్ళిన తప్పిపోయిన మత్స్యకారులు



విజయనగరం: ‘జల్’ తుపాను తరుముకొస్తున్న తరుణంలో మత్స్యకారుల జాడ తెలీకండా పోవడం కలవరం కలిగిస్తోంది. రాష్ట్ర తీర ప్రాంతాల్లో కొద్దిరోజుల క్రితం వేటకు వెళ్ళిన జాలర్లు ఇంకా తిరుగుముఖం పట్టకపోవడంతో, వారి బంధువుల్లో ఆందోళన నెలకొన్నది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సమీపంలో పదహారు మందితో కూడిన బోటు చిక్కుబడిపోవడంతో వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే కృష్ణా జిల్లా నాగాయలంక ఏసుపురానికి చెందిన ఇద్దరు జాలర్లు వేటకు వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. విజయనగరం తిప్పవలసలో ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్ళి సముద్రంలో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు నేవీ సిబ్బంది రంగంలోకి దిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
సుడులు తిరుగుతూ ఉగ్రంగా కదులుతున్న ‘జల్’



విశాఖపట్నం: తుపాను క్రమంగా, వేగంగా తీరానికి దూసుకొస్తోంది. సుడులు తిరుగుతూ, సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తూ జనంపై విరుచుకు పడటానికి ‘జల్’ ఉరికి వస్తోంది. ఊళ్ళకు ఊళ్ళను ముంచెత్తడానికి, పంటలను, ఇళ్ళను కబళించడానికి మహోగ్ర రూపం దాల్చి మున్ముందుకు పోటెత్తుతోంది. ప్రస్తుతం తుపాను గమనం రాడార్ పరిధిలోకి రావడంతో ‘జల్’గమనం మరింత స్పష్టంగా కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల తుపాను సంకేతాలను మరింత స్పష్టంగా అందించే అవకాశం ఉన్నదని, అర్థరాత్రిలోపు ఇది నెల్లూరు వద్ద తీరాన్ని తాకవచ్చని అధికారులు పునరుద్ఘాటించారు.


 

No comments:

Post a Comment